Episode Details
Back to Episodes
29. సంతులనమే పరమానందం
Season 8
Episode 29
Published 3 years, 4 months ago
Description
భగవద్గీత సారాన్నంతా 2.38 వ శ్లోకం సంగ్రహిస్తుంది. సుఖం దుఃఖం; లాభం నష్టం; జయ అపజయాలను సమానంగా భావించినప్పుడు యుద్ధం చేసినా పాపం అంటదని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెబుతారు. ఈ సమత్వాన్ని యుద్ధ సందర్భాలలోనే కాక ఇతర కర్మల విషయంలో కూడా అన్వయించుకోవచ్చు. మన కర్మలన్నీ ప్రేరేపితమైనవని, ఈ ప్రేరణ కర్మను అపవిత్రం లేదా పాపమయం చేస్తుందని ఈ శ్లోకం చెబుతుంది. కానీ మనం సుఖం, లాభం, విజయం, వంటి వాటి నుండి ప్రేరణ పొందకుండా కర్మను చేయడం ఎలాగో మనకు తెలీదు. అలాగే మనం చేసే కర్మలు దుఃఖం, నష్టం లేక అపజయాన్ని తప్పించుకోవడానికి చేసేవే. సాంఖ్య, కర్మయోగాల దృక్కోణం నుండి గమనిస్తే ప్రతి కర్మను మూడు భాగాలుగా విభజించవచ్చు; కర్త, కర్మ, కర్మఫలం. శ్రీకృష్ణుడు కర్మఫలాన్ని సుఖం-దుఃఖం, లాభం-నష్టం, విజయం-అపజయం గా విభజించారు. సంతులనం సాధించడానికి ఈ మూడింటిని వేరు చేయాలని శ్రీకృష్ణుడు ఉపదేశిస్తున్నారు. దీనికి ఒక మార్గం తానే కర్త అన్న భావనను విడనాడి తను కేవలం సాక్షిని మాత్రమే అన్న అవగాహన కల్పించుకోవడం. జీవితమనే జగన్నాటకంలో మనం పోషించే పాత్ర గణనీయం కాదన్న అవగాహన కలగాలి. మరొక మార్గం కర్మఫలాలపై మనకు ఎటువంటి హక్కు లేదని గుర్తించడం. అంటే కర్మఫలము మనప్రయత్నాలే కాక అనేక ఇతర కారకాల సమ్మేళనమని గుర్తించడం. కర్తృత్వాన్ని, కర్మఫలాలను విడనాడడమనే మార్గాలు అనుసంధానమై ఉంటాయి, కనుక ఒకదానిలో ప్రగతిని సాధిస్తే రెండవ దానిలో ప్రగతి దానంతటదే వస్తుంది. చేష్ట (పని) విషయానికి వస్తే, మనం ఎవరమూ ఈ భూమ్మీద అడుగుపెట్టడానికి ముందే అది ఉన్నది. దాన్ని సొంతం చేసుకోలేము లేక ఫలితాలను నియంత్రించలేము. ఈ శ్లోకాన్ని భక్తి యోగ కోణం నుంచి కూడా చూడవచ్చు భక్తి యోగంలో భావమే సర్వస్వంగా ఉంటుంది. శ్రీకృష్ణుడు కర్మ కంటే భావానికి ప్రాధాన్యతను ఇస్తారు. ఇది అంతర్గత శరణాగతిని, సమభావాన్ని దానికదే తీసుకువస్తుంది. తన దృక్పధాన్ని బట్టి వారు తమ మార్గాన్ని ఎంచుకోవచ్చు. దృష్టికోణం ఏదైనా ఈ శ్లోకాన్ని ధ్యానించడం ద్వారా అహంకారం నుండి విముక్తులై అంతరాత్మను చేరుకోగలరు.