Episode Details
Back to Episodes
33. వేదాలను అధిగమించి అంతరాత్మను పొందడం
Season 8
Episode 33
Published 3 years, 3 months ago
Description
ఒకసారి ఒక మిత్రబృందం ప్రయాణిస్తూ ఒక పెద్ద నదిని దాటాల్సి వచ్చింది. వారొక పడవను తయారుచేసి నదిని దాటారు. ఆ తర్వాత ఆ పెద్ద పడవ తమకు భవిష్యత్తులో ఉపయోగపడుతుందని మిగతా ప్రయాణమంతా దాన్ని మోసుకు వెళ్లాలని అనుకున్నారు. ఇందువల్ల వారి ప్రయాణం నెమ్మదించింది; ఇబ్బందికరంగా మారింది. ఇక్కడ నది ఒక బాధాకరమైన ధృవం అనుకుంటే పడవ ఆ ధృవాన్ని అధిగమించేందుకు ఉపయోగించే పరికరం. కానీ నది లేనిచోట సాగే ప్రయాణములో ఆ పడవే భారంగా మారుతుంది. ఇలాగే మన దైనందిన జీవితాల్లో మనం ఎదుర్కొనే అనేక బాధాకరమైన ధృవాల నుంచి మనకు విముక్తి కలిగించే అనేక పరికరాలు, అనుష్ఠానాలు ఉన్నాయి. ఇటువంటి తాత్కాలిక బాధల నుంచి ఉపశమనం పొందడం కోసం వేదాలు అనేక అనుష్ఠానాలను వివరించాయి. ఈనాటికీ ఈ ఆచారాలు అందుబాటులో ఉన్నాయి; ఆచరించబడుతున్నాయి. ఆరోగ్యం, వ్యాపారం, పని, కుటుంబ రంగాలలో మనకు ఇబ్బందులు ఎదురైనప్పుడు ఈ అనుష్ఠానాల సహాయం తీసికొనడం తార్కికంగా కనిపిస్తుంది. వేదాల బాహ్య అర్థాన్ని వివరించడం ద్వారా ఈ జీవితంలో సుఖాన్ని, మరణానంతర స్వర్గాన్ని వాగ్దానం చేసే తెలివితక్కువ వారి మాటలలో చిక్కుకోవద్దని శ్రీకృష్ణుడు ఉపదేశించారు (2.42-2.46). శ్రీకృష్ణుడు అర్జునుడిని ధ్రువాలను (ద్వంద్వాతీత), గుణాలను (గుణాతీత, నిర్గుణ) అధిగమించి ఆత్మవాన్ (ఆత్మలో స్థిరపడినవాడు) గా మారమని ప్రోత్సహిస్తారు (2.45). ఒక పెద్ద సరస్సు దొరికినప్పుడు అతనికి చిన్న చెరువుతో అవసరం లేదు. అదే విధంగా ఆత్మవాన్ కు వేదాలు చిన్న కాలువ లాంటివి (2.46). మన జీవన ప్రయాణంలో పడవ యొక్క భారాన్ని తలకెత్తుకుని మనల్ని మనం బాధించుకోకుండా ఉండటంలో జ్ఞానం ఉన్నట్లే సుఖం, శక్తిని పొందడానికి చేసే ప్రయత్నాలెంత వ్యర్ధమైనవో అర్థం చేసుకున్న తర్వాత వేదాలను అధిగమించమని శ్రీకృష్ణుడు ప్రోత్సహిస్తున్నారు. ఆరంభం నుంచి, శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంద్రియ-ఇంద్రియ విషయాల కలయిక సుఖదుఃఖాలనే ద్వంద్వాలను తెస్తుందని, అవి అనిత్యం (అశాశ్వతం) కాబట్టి వాటిని ఓర్చుకోమని సలహా ఇచ్చారు (2.14). వాటిని అధిగమించి ఈ క్షణికాలకి ద్రష్ట (సాక్షి) గా ఉండడం నేర్చుకోవాలనేది ఆయన ఉద్ఘాటన. శ్రీకృష్ణుడు కృత్రిమ సుఖాల కంటే ప్రామాణికమైన ఆనందానికి అనుకూలంగా ఉంటారు.