Episode Details
Back to Episodes
39. పునరావృతం ప్రావీణ్యానికి కీలకం
Season 8
Episode 39
Published 3 years, 2 months ago
Description
కర్ణుడు, అర్జునుడు కుంతికి జన్మించారు కానీ వ్యతిరేక పక్షాల కోసం పోరాడారు. కర్ణుడు శపించబడ్డాడు. దాని కారణంగా అర్జునుడితో కీలకమైన పోరాటంలో అతని జ్ఞానము, యుద్ధ అనుభవం అతనికి ఉపయోగపడలేదు. అతను యుద్ధంలో ఓడిపోయి, హతుడయ్యాడు. ఈ పరిస్థితి మనందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే మనమూ తరచూ కర్ణుడిలా ఉంటాము. మన జీవితంలో మనం చాలా నేర్చుకుంటాము; జ్ఞానాన్ని, అనుభవాన్ని పొందుతాము. కానీ కీలకమైన సమయాల్లో మనం అవగాహన కు బదులు మన ప్రవృత్తులను బట్టి ఆలోచిస్తాము, పని చేస్తాము. ఎందుకంటే మన అవగాహన అవసరమైన స్థాయి కంటే తక్కువగా ఉంటుంది. కృష్ణుడికి దీని గురించి పూర్తిగా తెలుసు కనుకనే భగవద్గీతలోని వివిధ కోణాల నుండి వాస్తవికతను, సత్యాన్ని పదేపదే వివరిస్తారు. తద్వారా లోతైన అవగాహనలో అవసరమైనంత స్థాయికి చేరుకోవాలనే ఇలా చెబుతుంటారు. ఒక నదికి ఉండే రెండు తీరాల్లా మనలో అంతరాత్మ, భౌతిక శరీరము అనే రెండు భాగాలున్నాయని భగవద్గీత చెబుతుంది. సాధారణంగా మనం మన భౌతిక శరీరం, మన భావోద్వేగాలు, ఆలోచనలు, మన చుట్టూ ఉన్న ప్రపంచంతో కూడిన బాహ్య భాగంతో గుర్తించబడతాము. శ్రీకృష్ణుడు మనల్ని అన్ని జీవులలో వ్యాపించి ఉన్నది, శాశ్వతమైనది, మార్పులేనిది అయిన మన అంతరాత్మను గుర్తించమని చెప్పారు. ఆత్మజ్ఞాని అంతరాత్మ అనే ఒక ఒడ్డు చేరుకొని ఇక్కడ కేవలం ఒక ఒడ్డు మాత్రమే ఉందని అవతలి ఒడ్డు తాడు పాము సాదృశంలో లాగా మాయావి అయిన సర్పం (భ్రాంతి) లాంటిదని తెలుసుకుంటాడు. ద్వంద్వాలను అధిగమించడం (ద్వంద్వాతీత); గుణాలను అధిగమించడం (గుణాతీత); సమానత్వం; కర్త కాదు మనం సాక్షి అని గ్రహించడం; కర్మ నుంచి కర్మఫలాల స్వతంత్రత అనే అవగాహనలే చైతన్య సాధన మార్గాలు. వంద పుస్తకాలు చదవడం కంటే భగవద్గీతను (ముఖ్యంగా 2వ అధ్యాయం) చాలాసార్లు చదవడం మంచిది. ఎందుకంటే ప్రతిసారీ గీతా పఠనం మనలో విభిన్నమైన రుచిని, మంచి భావనను, మెరుగైన సాక్షాత్కారాన్ని కలిగిస్తుంది. ఆనందాన్ని ప్రవహింపజేస్తుంది.