Episode Details
Back to Episodes
'మంత్రపుష్పం' - మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి కథ
Description
హర్షణీయంలో ఇప్పుడు వినబోయే కథ - మంత్రపుష్పం, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి రచన.
తన 19వ ఏటనే కథారచన ప్రారంభించి దాదాపు 125 కథలను రాశారు. వీరు రాసిన డుమువులు కథ 14 భారతీయ భాషలలోకి అనువదింపబడింది. మచిలీపట్నంలో బి.ఎ. వరకు చదివారు. తరువాత మద్రాసులో సంస్కృతాంధ్రాలలో ఎం.ఎ.పట్టా పుచ్చుకున్నారు. నాట్యకళలో, చిత్రలేఖనంలో, సంగీతంలో కూడా వీరికి ప్రవేశం ఉంది.
కృష్ణాతీరం అచ్చ తెలుగు నుడికారానికి పట్టం కట్టిన రచనగా తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే నవలగా ఖ్యాతి గడించింది.
ఈ కథను మీకందించడానికి అనుమతినిచ్చిన క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్ సూరిబాబు గారికి కృతజ్ఞతలు.
హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1
స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)
ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)
మంత్రపుష్పం :
పాపం! - చిట్టి రాలిపోయిందిరా!" అన్నాడు, మొనమొన్ననే జిల్లా కాంగ్రెసు సంఘంలో కృత్యాద్యవస్థమీద సభ్యుడుగా జొరబడ్డ మా పంతులు.
"ఎప్పుడు?" అని మేం నలుగురం అడిగాము, గొంతులు బిగిసి.
“వారం రోజులయింది!" అని జవాబు ఎక్కడో నూతిలోంచి వచ్చినట్టు!
"బ్రతికి ఎందర్నో సుఖ పెట్టింది! పోయి తాను సుఖపడుతుంది" అంటూ మాలో ఒకడి నిట్టూర్పు!
"ఆ బ్రతుక్కి చచ్చిపోవడంకన్న సుఖమేముంది? తెరిపి ఏముంది?- అదృష్టవంతురాలు!" అని మరొకడి సాకారం.
“అవును, దాని బ్రతుకంతా చచ్చినచావే! అది కాగా నెట్టుకొచ్చింది కాని, మరో ఆడదైతే-"
“మరో ఆడదానికి అంత దమ్ముంటుందా?- గట్టిగా చెడిపోయేందుకన్నా నిష్ఠంటూ ఒకటి ఉండాలి!"
చిట్టి బ్రతికి ఉన్నప్పుడు, ఎవరన్నా ఇలా నోరెత్తగలిగారా? - ఎవడికి గుండెలున్నాయ్
-ఎవరెల్లా మాట్లాడినా, మొత్తానికి అందరమూ చిట్టి స్వర్గానికి చేరుకున్నందుకు - సాదా స్వర్గం కాదు, పచ్చి వీరస్వర్గం - ఎంతో వాపోయినాము. మా విచారం చిట్టి పోయిందని కాదు. సరిగ్గా ఆ వేళకే - ఎప్పుడూ ఊళ్ళోనే ఉట్టి కట్టుకుని ఊరేగే బడుద్దాయిలం యావన్మందీ - ఏదో మునిగిపోయినట్లు - ఎవరమూ ఊళ్ళో లేకుండా పోయినందుకు, ఆ వైభవం కళ్ళారా చూసే భాగ్యం లేకపోయినందుకు..
చిట్టి భౌతిక శరీర లేశానికి వీరాధి వీరోచిత మర్యాదలు జరిగినవి. త్రివర్ణ పతాకాన్ని కప్పి, కాంగ్రెసు వాలంటీర్లు, రెండోరకం నాయకులూ జయజయ నినాదాలతో బారులు తీరి ముందు నడవగా, చిట్టి పితృవనానికి పయనించింది. మంచిగంధపు ధూళిలో మలిగిపోయింది.
ఈ మర్యాదలో మర్మం - మా ఊరి వారికి - అందులోనూ ఇంగితమున్న కొందరికి - కాని అర్థంకాదు. విన్నవాళ్ళూ - పత్రికలో చదివిన వాళ్ళూ - "ఇదేం విడ్డూరం? ఈ ఊళో కాంగ్రెసువారు కేమన్నా పిచ్చి ఎక్కిందా? లేకపోతే, పెద్దలను వెక్కిరించడానికా, ఈ తతంగమంతా.
లేకపోతే.. సామాన్యపు బజారీ పడుపుగత్తె కనుమూస్తే బ్రహ్మరథం పడతారా?